ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి (యూఎన్-హెచ్ఆర్సీ) నుంచి అమెరికా జూన్ 20న వైదొలిగింది. హెచ్ఆర్సీ ఇజ్రాయెల్పై పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా రాయబారి నిక్కీహేలీ, విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. తాజాగా మెక్సికో అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న ‘జీరో టాలరెన్స్’ విధానం సరైంది కాదని యూఎన్-హెచ్ఆర్సీ పేర్కొంది. దీంతో ట్రంప్ యంత్రాంగం మండలి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. అలాగే ఇజ్రాయెల్పై కఠిన వైఖరిని అవలంబిస్తుందని ఆరోపిస్తూ అమెరికా ఐరాస అనుబంధ సంస్థ యునెస్కో నుంచి 2017లో బయటకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల పరిరక్షణకు జెనీవా కేంద్రంగా ఏర్పడిన యూఎన్ హెచ్ఆర్సీలో ప్రస్తుతం 47 సభ్యదేశాలున్నాయి.
ముగిసిన గ్రీస్ సంక్షోభం
ఎనిమిదేళ్లుగా బెయిలవుట్ ప్యాకేజీలపై నెగ్గుకొస్తున్న గ్రీస్ సంక్షోభం నుంచి గట్టెక్కనుంది. ఈ మేరకు రుణాల చెల్లింపుపై గ్రీస్తో ఒప్పందం కుదిరిందని యూరోపియన్ యూనియన్ తెలిపింది. దీంతో రుణాల చెల్లింపు గడువును 10 ఏళ్లు పొడిగించడంతో పాటు మరో 15 బిలియన్ యూరోలు గ్రీస్కు అందనున్నాయి. ఒప్పంద షరతుల కింద 2019లో పింఛన్లలో కోత విధించడంతో పాటు ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని తగ్గించేందుకు గ్రీస్ అంగీకరించింది. 2010 నుంచి గ్రీస్ 273.7 బిలియన్ యూరోల మేర నిధులను బెయిలవుట్ కింద పొందింది. ఈ సంక్షోభం ధాటికి గీస్లో 4 ప్రభుత్వాలు మారాయి. ఎకానమీ 25% క్షీణించింది. నిరుద్యోగిత 20% పెరిగింది.
సౌదీలో మహిళల డ్రైవింగ్ ఉత్తర్వులు అమలు
సౌదీ అరేబియాలో మహిళల డ్రైవింగ్పై నిషేధాన్ని ఎత్తివేయడంతో మహిళలు జూన్ 24న వాహనాలతో రోడ్లపైకొచ్చారు. కార్లతో సందడి చేస్తూ, సంబరాలు చేసుకున్నారు. దాదాపు 4 దశాబ్దాలుగా మహిళల డ్రైవింగ్పై ఉన్న నిషేధాన్ని ఆ దేశ యువరాజు బిన్ సల్మాన్ ఇటీవల ఎత్తివేశాడు. ఈ ఉత్తర్వులు 2018, జూన్ 24 నుంచి అమల్లోకి రావడంతో మహిళందరు రోడ్లపై వాహనాలతో కన్పించారు.
టర్కీ అధ్యక్ష ఎన్నికల్లో ఎర్డోగన్ గెలుపు
టర్కీ అధ్యక్ష ఎన్నికల్లో జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ అభ్యర్థి రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ (64) మరోసారి విజయం సాధించారు. జూన్ 24 న జరిగిన ఓట్ల లెక్కింపులో ఎర్డోగన్కు 52.5 శాతం, ఆయన ప్రత్యర్థి ముహర్రెమ్ ఇన్సేకు 30.6 శాతం ఓట్లు దక్కాయి. తాజా ఫలితాలతో ఎర్డోగన్ మరో ఐదేళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. అధ్యక్ష ఎన్నికలతో పాటు 600 సీట్లున్న టర్కీ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఎర్డోగన్కు చెందిన ఏకేపీ పార్టీ 293 స్థానాలను దక్కించుకోగా, మిత్రపక్షం ఎంహెచ్పీ 50 సీట్లు గెలుచుకుంది.
జర్మనీలో ప్రపంచ ఆహార సదస్సు-2018
జర్మనీ రాజధాని బెర్లిన్లో ప్రపంచ ఆహార సదస్సు-2018ను జూన్ 26న నిర్వహించారు. ఈ సదస్సులో తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డెరైక్టర్ డాక్టర్ కేశవులు, వేములవాడ ఎమ్మెల్యే సీహెచ్ రమేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ సీడ్ వ్యాలీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సహకారం అందిస్తామని జర్మనీ ఆహార, వ్యవసాయ మంత్రి జూలియా క్లోవిక్నర్ హామీ ఇచ్చారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఎద్దుమైలారంలో 100 ఎకరాల్లో సీడ్ వ్యాలీని ఏర్పాటు చేయడానికి సహాకారం అందిస్తామని, అలాగే గ్లోబల్ సీడ్ అడ్వయిజరీ బాడీ, ఇండో-జర్మన్ నాలెడ్జ సెంటర్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మరోవైపు జర్మనీ-తెలంగాణ మధ్య ఉన్న ఇండో-జర్మన్ ప్రాజెక్టును మరో మూడేళ్లు పొడిగిస్తున్నామని క్లోవిక్నర్ అన్నారు. 2019 జూన్ 26 నుంచి జూలై 3 వరకు హైదరాబాద్లో జరిగే అంతర్జాతీయ విత్తన పరిశోధన సంస్థ కాంగ్రెస్కు హాజరుకావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ క్లోవిక్నర్కు లేఖ పంపారు. ఆసియాలోనే మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో పలు దేశాల నుంచి విత్తన నిపుణులు, శాస్త్రవేత్తలు పాల్గొంటారు.
ఆస్తానాలో 25వ ప్రపంచ మైనింగ్ సదస్సు
కజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో 25వ ప్రపంచ మైనింగ్ సదస్సు జూన్ 19న ప్రారంభమైంది. జూన్ 22 వరకు జరగనున్న ఈ సదస్సులో 50 దేశాల నుంచి 2,000 మంది ప్రతినిధులు పాల్గొనగా భారత్ నుంచి సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్తోపాటు కోలిండియా, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, ఎన్ఎండీసీ వంటి మైనింగ్ సంస్థల నుంచి సుమారు 50 మంది ప్రతినిధులు హాజరయ్యారు. సదుస్సులో భాగంగా తొలిరోజు ‘భూగర్భ మైనింగ్-పెట్టుబడులకు అవకాశాలు, కొత్త టెక్నాలజీ’, బొగ్గు నుంచి ఇంధనం తయారీ, బొగ్గు వినియోగం, కజకిస్తాన్లో మైనింగ్, భూగర్భ బొగ్గు గనుల్లో అత్యాధునిక లాంగ్ వాల్ గేట్ రోడ్ సపోర్టు, బొగ్గు ద్వారా ప్రత్యామ్నాయ విద్యుత్తు ఉత్పత్తి వంటి అంశాలపై చర్చించారు. అలాగే 2030 నాటికి ప్రపంచ జనాభాకు కావాల్సిన ఖనిజాలను అందుబాటులో ఉంచడం, డిజిటలైజేషన్ 4 జీన్సు వంటి కీలకాంశాలపై ప్రపంచ మైనింగ్ మేధావులు తమ విశ్లేషణలు సమర్పించారు. తదుపరి కోల్ మైనింగ్ కాంగ్రెస్ను 2021లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో నిర్వహిస్తారు.
ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బిజోస్
ఫోర్బ్స్ 2018 ప్రపంచ కుబేరుడిగా 141.9 బిలియన్ డాలర్ల సంపదతో అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బిజోస్ నిలిచాడు. అలాగే అమెరికాలోని అతిపెద్ద కంపెనీల్లో 177.87 బిలియన్ డాలర్ల ఆదాయంతో అమెజాన్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ మేరకు టాప్ 100 బిలియనీర్ల జాబితాను ఫోర్బ్స్ జూన్ 18న విడుదల చేసింది. జూన్ 1 నుంచి బిజోస్ సంపద దాదాపు 5 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ జాబితాలో 92.9 బిలియన్ డాలర్లతో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ రెండో స్థానం, 82.2 బిలియన్ డాలర్లతో వారెన్ బఫెట్ మూడో స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో నలుగురు భారతీయులకు చోటు దక్కింది. 40.1 బిలియన్ డాలర్లతో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 19వ స్థానం, 18.8 బిలియన్ డాలర్లతో అజీమ్ ప్రేమ్ జీ 58వ స్థానం, 18.5 బిలియన్ డాలర్లతో లక్ష్మీ మిట్టల్ 62వ స్థానం, 14.6 బిలియన్ డాలర్లతో శివ నాడర్ 98వ స్థానంలో ఉన్నాడు.
చైనాలో 18వ ఎస్సీవో సదస్సు షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) 18వ సదస్సు చైనాలోని క్వింగ్డావ్లో జూన్ 9 నుంచి 10 వరకు జరిగింది. ఈ సదస్సులో ఎస్సీవో సభ్యదేశాలైన భారత్, చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, పాకిస్థాన్ దేశాధినేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ్యదేశాలన్నీ చైనా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ)కు ఆమోదం తెలపగా ప్రధాని నరేంద్ర మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు. సదస్సులో ప్రసంగించిన చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ భారత్, పాక్లు ఎస్సీవోలో శాశ్వత సభ్యదేశాలుగా చేరడంతో ఈ కూటమి బలం పెరిగిందని, మనం ప్రచ్ఛన్నయుద్ధ ఆలోచనలను తిరస్కరించి ప్రాంతీయ ఆర్థిక సహకారాన్ని పెంపోందించుకోవాలని పేర్కొన్నారు. అనంతరం ఎస్సీవో డిక్లరేషన్ ను విడుదల చేశారు. ఈ కూటమిలో 2005 నుంచి పరిశీలక హోదా కలిగిన భారత్ పూర్తిస్థాయి సభ్యత్వం వచ్చిన తర్వాత పాల్గొన్న తొలి సమావేశం ఇది. సదస్సుకు ముందు ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ద్వైపాక్షిక బంధాలపై చర్చలు జరిపారు. బ్రహ్మపుత్ర నదిపై సమాచార మార్పిడి, బియ్యం ఎగుమతులు వంటి అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అదే విధంగా ఎస్సీవో సెక్రటరీ జనరల్ రశీద్ అలిమోవ్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు మిర్జియోయేవ్, తజికిస్తాన్ అధ్యక్షుడు ఎమోమలీ రెహమాన్తో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీజింగ్లోని ఎస్సీవో ప్రధాన కార్యాలయంలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని రశీద్ చెప్పారు. బీఆర్ఐ అనగా... ఆగ్నేయాసియా, మధ్య ఆసియా, గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా, యూరప్లలోని రోడ్డు, సముద్రమార్గాలను కలుపుతూ బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ)ని నిర్మించనున్నట్లు చైనా 2013లో ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు అంగీకరిస్తూ 80 దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు, ఇప్పటికే బీజింగ్తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, ఇప్పటికే దాదాపు రూ.8.5 లక్షల కోట్లు విడుదల చే శామని చైనా వెల్లడించింది. బీఆర్ఐలో భాగంగా చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) ను పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ గుండా నిర్మిస్తున్నారు. వివాదాస్పదమైన జమ్మూ ప్రాంతంలో ఈ ప్రాజెక్టును చేపట్టడం తమ సార్వభౌమత్వాన్ని అగౌరవపరచడమేనని భారత్ దీనిని వ్యతిరేకిస్తుంది.
కెనడాలో జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు
జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు కెనడాలోని క్యూబెక్లో జూన్ 8 నుంచి 9 వరకు జరిగింది. ఈ సదస్సుకు కెనడా ప్రధాని ట్రూడో నేతృత్వం వహించారు. ఇనుము, వాహనాల ఎగుమతులపై అమెరికా టారిఫ్లు పెంచడం, వాణిజ్యం, పర్యావరణం, ఇరాన్ అణు ఒప్పందం వంటి అంశాలపై సభ్యదేశాధినేతలు సదస్సులో చర్చించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనను అమెరికా తిరస్కరించింది. 2014లో క్రిమియాను ఆక్రమించినందుకు రష్యాను జీ-8 కూటమి నుంచి తొలగించడంతో జీ-7గా మారింది. ప్రస్తుతం అమెరికా, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి.
సూపర్ కంప్యూటర్ ‘సమిట్’ ను ఆవిష్కరించిన అమెరికా
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సూపర్ కంప్యూటర్ ‘సమిట్’ ను అమెరికా జూన్ 8 న ఆవిష్కరించింది. చైనాకు చెందిన సన్వే తైహులైట్ (సెకనుకు 93 వేల ట్రిలియన్ల గణనలు చేయగలదు) రికార్డులను అధిగమించేలా దీన్ని తీర్చిదిద్దారు. ఓక్రిడ్జ్ నేషనల్ ల్యాబ్ ఏర్పాటు చేసిన ఈ సమిట్ సెకనుకు రెండు లక్షల ట్రిలియన్ల గణనలు చేయగలదు.
ఐరాస అసెంబ్లీ అధ్యక్షురాలిగా మరియా
ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ అధ్యక్షురాలిగా ఈక్వెడార్ విదేశాంగ మంత్రి మరియా ఫెర్నాండా ఎస్పినోస గార్సెస్ జూన్ 5న ఎన్నికయ్యారు. 2018 సెప్టెంబర్ నుంచి ఏడాది పాటు కొనసాగనున్న 73వ సెషన్కు ఆమె నేతృత్వం వహిస్తారు. దీంతో సాధారణ అసెంబ్లీకి నేతృత్వం వహిస్తున్న నాలుగో మహిళగా మరియా గుర్తింపు పొందారు. మొదటిసారిగా 1953లో భారత్కి చెందిన విజయలక్ష్మి పండిట్ సాధారణ అసెంబ్లీకి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. తర్వాత 1969లో లైబీరియాకు చెందిన ఎలిజబెత్ బ్రూక్స్, 2006లో బహ్రెయిన్కు చెందిన షేకా హయా రషెద్ అల్ ఖలీఫాలు అధ్యక్షులుగా పనిచేశారు. ప్రస్తుతం ఐరాసలో మొత్తం 198 సభ్య దేశాలున్నాయి
ఈజిప్ట్ అధ్యక్షుడిగా అబ్దెల్ ఫతహ్ అల్-సిసీ
ఈజిప్ట్ అధ్యక్షుడిగా అబ్దెల్ ఫతహ్ అల్-సిసీ ఈనెల 2న ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆయన మరో నాలుగేళ్లు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. మార్చిలో జరిగిన ఎన్నికల్లో 97% ఓట్లతో ఆయన విజయం సాధించారు. మహమ్మద్ మోర్సీని సైన్యం పదవీచ్యుతుడిని చేసిన అనంతరం 2014లో సీసీ తొలిసారి అధ్యక్ష పదవి చేపట్టారు.