మే 2018 అంతర్జాతీయం

అబార్షన్ చట్టాల రద్దు దిశగా ఐర్లాండ్ :-

ఐర్లాండ్‌లో గర్భస్థ శిశువు, తల్లికి సమాన హక్కులు కల్పిస్తున్న 8వ రాజ్యాంగ సవరణను రద్దు చేయాలని (అబార్షన్ వ్యతిరేక చట్టాల రద్దు) కోరుతూ నిర్వహించిన రిఫరెండంలో 66.4 శాతం మంది అనుకూలంగా, 33.6 శాతం మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. సంప్రదాయ క్యాథలిక్ దేశమైన ఐర్లాండ్‌లో గర్భవిచ్ఛిత్తి (అబార్షన్)కి సంబంధించి కఠిన నిబంధనలున్నాయి. కడుపులో ఉన్న పిండానికి, తల్లికి జీవించే హక్కును ఇక్కడి రాజ్యాంగం సమాన స్థాయిలో కల్పిస్తోంది. తాజా ప్రజాభిప్రాయ సేకరణకు ఐర్లాండ్‌లో భారతీయ మహిళ అయిన సవితా హాలప్పనవర్ (31) మృతి ప్రధాన కారణం కావడం గమనార్హం.


వెనెజులా ఎన్నికల్లో మదురో విజయం

వెనెజులాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో యునెటైడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనెజులా కి చెందిన నేత నికోలస్ మదురో విజయం సాధించారు. దీంతో ఆయన మరో ఆరేళ్లపాటు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. దాదాపు 46.1 శాతం పోలింగ్ నమోదుకాగా మదురో 58 లక్షలు (68 శాతం) ఆయన ప్రత్యర్థి హెన్రీ ఫాల్కన్ 18 లక్షల ఓట్లను దక్కించుకున్నారని జాతీయ ఎన్నికల కౌన్సిల్ మే 20న ప్రకటించింది. 2013, మార్చి 5న అప్పటి దేశాధ్యక్షుడు హ్యుగో చావెజ్ మరణంతో మదురో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. కాగా ఈ ఎన్నికల్ని బహిష్కరించిన ప్రతిపక్షాలు మరోసారి పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నిక లు సరైన పద్ధతిలో జరగలేదని ఈ ప్రభుత్వాన్ని గుర్తించమని అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ)తో పాటు 17 పొరుగుదేశాలు ప్రకటించాయి.


అత్యధిక బిలీయనీర్లు కలిగిన దేశంగా అమెరికా

2027 నాటికి 884 మంది బిలీయనీర్లతో ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు కలిగిన దేశంగా అమెరికా నిలవనుంది. ఈ జాబితాలో 448 మంది బిలియనీర్లతో చైనా 357 మంది బిలియనీర్లతో భారత్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అలాగే రష్యా సమాఖ్య 142, బ్రిటన్ 113, జర్మనీ 90, హాంగ్‌కాంగ్ 78 మంది బిలీయనర్లతో తర్వాతి స్థానాల్లో నిలవనున్నాయి. ఈ మేరకు ఏఎఫ్‌ఆర్ ఏసియా బ్యాంక్ గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ ఇండియా సంస్థ నిర్వహించిన అద్యయనంలో మే 23న వెల్లడించింది. ప్రస్తుతం భారత్‌లో 119 మంది బిలీయనీర్లు ఉండగా ప్రపంచవ్యాప్తంగా 2,252 మంది ఉన్నారు. 2027 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 3,444 మంది బిలీయనీర్లు ఉంటారని ఏఎఫ్‌ఆర్ ఏసియా సంస్థ అంచనా వేసింది. రానున్న పదేళ్లలో భారత్ సంపద 200 శాతం, ప్రపంచ సంపద 50 శాతం పెరిగి 2027 నాటికి మొత్తం ప్రపంచ సంపద 321 ట్రిలియన్లకు చేరుకుంటుందని సంస్థ వెల్లడించింది. ఒక బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ అమెరికన్ డాలర్ల సంపద కలిగిన వ్యక్తిని బిలియనీర్ అని అంటారు.


మలేసియా ప్రధానిగా మహతీర్

మలేసియా ప్రధానమంత్రిగా మహతీర్ బిన్ మహమ్మద్ మరోసారి ఎన్నికయ్యారు. దీంతో ప్రపంచంలో అత్యంత పెద్ద వయసులో (92 ఏళ్ల వయసులో) ఎన్నికైన ప్రధానమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. మొత్తం 222 సీట్లున్న పార్లమెంట్‌లో ‘పకటన్ హరపన్’ కూటమికి 113 సీట్లు గెలుచుకోడంతో రాజధానిలోని ఇస్తానా నెగర ప్రాసాదంలో మే 10న మహతీర్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. బరిసాన్ నేషనల్(బీఎన్) కూటమికి చైర్మన్‌గా ఉన్న సమయంలో 1981-2003 వరకు దాదాపు 22 ఏళ్లపాటు మహతీర్ ప్రధానిగా పనిచేశారు.


భారతీయులకు 93 శాతం హెచ్-4 వీసాలు

అమెరికాలో పనిచేస్తున్న విదేశీ నిపుణుల జీవిత భాగస్వాములకు ఇచ్చే హెచ్-4 (స్పౌస్) వీసాలను పొందిన వారిలో అత్యధికంగా 93 శాతం మంది భారతీయులు ఉన్నారు. భారతీయుల తర్వాత 5 శాతం మంది చైనీయులు ఈ వీసాలను పొందారు. ఈ మేరకు అమెరికన్ సంస్థ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్‌ఎస్) మే 12న వెల్లడించింది. హెచ్-4 వీసాలు పొందిన వారు కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీలో ఎక్కువగా పనిచేస్తున్నారు. 2017, డిసెంబర్ 25 నాటికి యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ 1,26,853 హెచ్-4 వీసా దరఖాస్తులను ఆమోదించింది.


అర్మేనియా ప్రధానిగా పషిన్యాన్

అర్మేనియా ప్రధానిగా నికోల్ పషిన్యాన్ ఎన్నికయ్యారు. ఆ దేశ పార్లమెంటులో మే 8న జరిగిన ఎన్నికలో పషిన్యాన్‌కు అనుకూలంగా 59 ఓట్లు, వ్యతిరేకంగా 42 ఓట్లు పడ్డాయి. అధికార రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకంగా పషిన్యాన్ పెద్ద ఎత్తున ఉద్యమం నడిపారు. ఇదే తాజా ఎన్నికలకు కారణం.

కేంబ్రిడ్జ్ అనలిటికా మూసివేత

ఫేస్‌బుక్ యూజర్ల డేటా దుర్వినియోగంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్‌కు చెందిన డేటా కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా మూతపడింది. వ్యాపారంలో నష్టాలు రావడం వల్లే మూసివేస్తున్నట్టు సంస్థ యాజమాన్యం మే 3న ప్రకటించింది. 8.7 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల సమాచారాన్ని సేకరించి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా వాడినట్టు అనలిటికాపై ఆరోపణలు వచ్చాయి. అలాగే బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఇదే విధానాన్ని ఉపయోగించినట్టు, భారత్‌లోనూ సుమారు 5 లక్షల మంది యూజర్ల సమాచారాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేసినట్టు వెలుగులోకి రావడంతో ఆ సంస్థ వివాదాల్లో చిక్కుకుంది.


రష్యాలో తేలియాడే అణు విద్యుత్ కేంద్రం

రష్యా ‘అకడమిక్ లోమనోసోవ్’ అనే సముద్రంలో తేలియాడే అణువిద్యుత్ కేంద్రాన్ని నిర్మించింది. ఇది ప్రపంచంలోనే తొలి తేలియాడే అణువిద్యుత్ కేంద్రం కావడం గమనార్హం. దీన్ని రష్యా అణుశక్తి కార్పొరేషన్ సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని షిప్‌యార్డ్‌లో నిర్మించి.. చుకోట్కా పోర్ట్ ఆఫ్ పెవెక్‌కు తరలిస్తోంది. అక్కడికి వెళ్లిన తర్వాత ఇంధనం నింపి ఉత్పత్తిని ప్రారంభిస్తారు. ఇది ఉత్పత్తి ప్రారంభిస్తే ఏటా 50 వేల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాన్ని తగ్గించొచ్చని అంచనా.