ఏప్రిల్ 2018 అంతర్జాతీయం

ప్రపంచ రుణ భారం 164 ట్రిలియన్ డాలర్లు

ప్రపంచ రుణ భారం భారీగా పెరిగిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. 2016 నాటికి 164 ట్రిలియన్ డాలర్లకు చేరిందని తెలిపింది. ప్రపంచ వార్షిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే ఇది 225 శాతం అధికం. 2017లో భారత రుణ భారం జీడీపీలో 70 శాతంగా ఉంది.


లండన్‌లో చోగమ్ సదస్సు

కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సదస్సు 2018 (చోగమ్)ను క్వీన్ ఎలిజబెత్ ఏప్రిల్ 19న లండన్‌లో ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన 91 ఏళ్ల రాణి క్వీన్ ఎలిజబెత్ కామన్వెల్త్ చీఫ్‌గా తన కొడుకు ప్రిన్స్ చార్లెస్ పేరును ప్రతిపాదించారు. చోగమ్ సదస్సులో పాల్గొనడానికి లండన్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, మారిషస్ ప్రధాని జుగ్‌నౌత్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో మోదీ సమావేశమయ్యారు.


అణు పరీక్షలు నిలిపేసిన ఉత్తర కొరియా

నిరంతర ఆయుధ పరీక్షలతో ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఉత్తర కొరియా అణు పరీక్షలు, ఖండాంతర క్షిపణి ప్రయోగాలను నిలిపేయాలని నిర్ణయించింది. త్వరలోనే దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ భేటీ కానున్నందున ఈ మేరకు ప్రకటించింది. ఏప్రిల్ 21న జరిగిన అధికార వర్కర్స్ పార్టీ ప్లీనరీ సమావేశంలో ‘అవసరమైన ఆయుధాలు, క్షిపణులపై అమర్చే సూక్ష్మ వార్‌హెడ్లను అభివృద్ధి చేసుకున్నాం. ఇక మనకు అణు పరీక్షలు, మధ్యంతర, ఖండాంతర క్షిపణుల అవసరం లేదు’ అని కిమ్ అన్నారని ఆ దేశ అధికారిక వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్‌ఏ) వెల్లడించింది.


పాకిస్తాన్ మాజీ ప్రధాని షరీఫ్ పై నిషేధం

పనామా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పై ఆ దేశ సుప్రీంకోర్టు జీవితకాల నిషేధం విధించింది. షరీఫ్‌తో పాటు పాకిస్తాన్ తెహ్రికీ ఇన్సాఫ్ (పీటీఐ) నేత జహంగీర్ తరీన్‌పై కూడా రాజకీయ నిషేధం విదిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. పనామా పేపర్స్ కేసులో షరీఫ్ 2017 జూలై 28న తన ఎంపీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్ష పదవులకు రాజీనామా చేశారు. పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 62 (1) (ఎఫ్) ప్రకారం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ చట్టసభ్యుడిపై నిషేధం విధించవచ్చు.


పార్క్ గుయెన్ హై కి 24 ఏళ్ల జైలు శిక్ష

అవినీతి కేసులో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గుయెన్ హై కి 24 ఏళ్ల జైలు శిక్ష పడింది. కొరియా తొలి మహిళా అధ్యక్షురాలిగా 2013లో చరిత్రకెక్కిన గుయెన్ లంచం, అధికార దుర్వినియోగం వంటి పలు కేసుల్లో దోషిగా తేలారు. పార్క్ ప్రముఖ వ్యాపారవేత్త చోయి సూన్ సిల్ తో కలసి దాదాపు రూ.140 కోట్లు లంచంగా డిమాండ్ చేశారు. ఈమె దక్షిణ కొరియా నియంత పార్క్ చుంగ్ హీ కుమార్తె.

ఐరాస ఉగ్ర జాబితాలో అగ్రభాగాన పాక్ ఐక్యరాజ్యసమితి ఏప్రిల్ 3న వెల్లడించిన ఉగ్రవాదుల జాబితాలో 139 మందితో పాకిస్థాన్ అగ్రభాగాన నిలిచింది. పాకిస్తాన్‌లో నివసిస్తూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని ఈ జాబితాలో చేర్చారు. ఇందులో అల్‌ఖైదా నేత అల్ జవహరి ముందు వరుసలో ఉన్నారు.
అలీనోద్యమ దేశాల మంత్రుల సమావేశం

అజర్‌బైజాన్ రాజధాని బాకూలో ఏప్రిల్ 5న అలీనోద్యమ(నామ్) దేశాల 18వ మధ్యకాలిక సమావేశం జరిగింది. దీనికి భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ శాంతి, భద్రతకు ఉగ్రవాదం పెనుముప్పులా పరిణమించిందన్నారు.


మయన్మార్ అధ్యక్షుడిగా విన్ మైంట్

మయన్మార్ నూతన అధ్యక్షుడిగా అంగ్‌సాన్ సూచీ అనుచరుడు విన్ మైంట్ మార్చి 28న ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు హితిన్ క్యా తన పదవికి రాజీనామా చేయడంతో నూతన అధ్యక్షుడి కోసం పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్‌లో విన్ (ఎన్‌ఎల్‌డీ) కు మూడింట రెండు వంతుల మెజారిటీ లభించింది. 2015లో జరిగిన ఎన్నికల్లో సూచీ పార్టీ భారీ విజయం సాధించింది. అయితే సూచీ ఓ విదేశీయుణ్ణి పెళ్లి చేసుకోవడంతో, ఇక్కడి మిలిటరీ రాజ్యాంగం ప్రకారం ఆమె అధ్యక్ష పదవి చేపట్టేందుకు అనర్హురాలైంది.


వేతన వివక్షపై ‘పేమీటూ’ పేరిట కొత్త ఉద్యమం

మహిళలపై కొనసాగుతున్న వేతన వివక్షకు వ్యతిరేకంగా బ్రిటన్‌లోని లేబర్ పార్టీకి చెందిన ఎంపీ స్టెలా క్రీజీ నేతృత్వంలో #paymetoo అనే ఉద్యమం ప్రారంభమైంది. మహిళలకు సమానంగా వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ఉద్యోగులు యాజమాన్యాలను అడగడమే ఈ ఉద్యమం ప్రధాన ఉద్దేశం. 250కి పైగా ఉద్యోగులు ఉన్న ప్రైవేటు కంపెనీలన్నీ ఒక గంట పనికి మహిళలకు, పురుషులకు చెల్లించే వేతనాల్లో వ్యత్యాసాన్ని తప్పనిసరిగా బయటపెట్టాలంటూ బ్రిటన్ కొత్త చట్టం చేసింది. ఇందుకోసం ఏప్రిల్ 4 వరకు గడువు ఇచ్చింది. భారత్‌లో కూడా ఒకే హోదాలో, ఒకే పనిచేస్తున్న పురుషుల కంటే మహిళల వేతనాలు 20 శాతం తక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనాలు వెల్లడించాయి.


అమెరికా వస్తువులపై చైనా దిగుమతి సుంకం

అమెరికా నుంచి చైనాకు దిగుమతయ్యే 128 వస్తువులపై చైనా తాజాగా దిగుమతి సుంకం విధించింది. అమెరికాకు దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతిగా చైనా ఈ చర్య చేపట్టింది. పండ్లు, సంబంధిత 120 ఉత్పత్తులపై 15%, పంది మాంసం, సంబంధిత 8 ఉత్పత్తులపై 25% చొప్పున సుంకం విధించింది.


ఈజిప్ట్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన ఎల్ సిసీ

ఈజిప్ట్ అధ్యక్షుడిగా అబ్దెల్ ఫత్తాహ్ ఎల్ సిసీ తిరిగి ఎన్నికయ్యారు. ఆయనకు అధ్యక్ష ఎన్నికల్లో 97.08 శాతం ఓట్లు లభించినట్లు జాతీయ ఎన్నికల సంస్థ(ఎన్‌ఈఏ) ఏప్రిల్ 2న ప్రకటించింది.

కోస్టారికా అధ్యక్షుడిగా కార్లోస్ అల్వరాడో

కోస్టారికా అధ్యక్షుడిగా నవలా రచయిత, సంగీతకారుడు కార్లోస్ అల్వరాడో ఎన్నికయ్యారు. ఆయనకు ఎన్నికల్లో 60 శాతానికి పైగా ఓట్లు లభించాయి. కార్లోస్ పాత్రికేయం, రాజనీతి శాస్త్రాల్లో పట్టభద్రుడు.