ఆస్ట్రేలియాపభుత్వం విదేశీ నిపుణులకు జారీచేసే 457 వీసా పథకాన్ని రద్దు చేసింది. భారతీయులు ఎక్కువగా లబ్ధిపొందుతున్న ఈ వీసా స్థానంలో కఠిన నిబంధనలతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ఆస్ట్రేలియా వీసా పొందాలంటే ఇంగ్లిష్లో మంచి ప్రావీణ్యం, ఉద్యోగ నైపుణ్యం తప్పనిసరి. అమెరికా తరహాలోనే ఆస్ట్రేలియా కూడా తమ పౌరులకే తొలి ప్రాధాన్యం ఇచ్చేలా 'ఆస్ట్రేలియా ఫస్ట్' విధానాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 457 వీసా పథకాన్ని రద్దు చేస్తామని గతేడాదే ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్నబుల్ ప్రకటించారు. ఆ క్రమంలో 457 వీసాని రద్దు చేస్తూ.. దాని స్థానంలో టెంపరరీ స్కిల్ షార్టేజ్ (టీఎస్ఎస్) అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. మార్చి 18 నుంచి ఈ కొత్త వీసా విధానం అమల్లోకి వచ్చింది. విదేశీ ఉద్యోగుల వల్ల స్థానికులకు అవకాశాలు దక్కడం లేదని కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో తాజా వీసా పథకాన్ని తెరపైకి తెచ్చారు. ఈ పరిణామం భారత్ టెకీలపై ప్రభావం చూపనుంది. 2017 చివరి నాటికి ఈ వీసా కింద ఆ దేశంలో 90,033 మంది ఉంటే వారిలో 21 శాతం మంది భారతీయులే.
చైనాపై వాణిజ్య ఆంక్షలు విధించిన యూఎస్
చైనా దిగుమతులపై 60 బిలియన్ డాలర్ల వార్షిక సుంకాలను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్చి 22న కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. ఏ వస్తువుపై ఎంత పన్ను విధించాలనే విషయాన్ని త్వరలో నిర్ణయిస్తామని తెలిపారు. ట్రంప్ నిర్ణయంతో చైనా నుంచి దిగుమతయ్యే 1300(దాదాపు) వస్తువుల ధరలు పెరగుతాయని ఆర్థికవేత్తల అంచనా. అయితే దీనికి ప్రతిగా చైనా సైతం అమెరికా వస్తువులపై టారిఫ్లు పెంచింది.
భూమిపై మిగిలిన ఒకేఒక తెల్లని మగ ఖడ్గమృగం మృతి
భూమిపై మిగిలిన ఒకేఒక తెల్లని మగ ఖడ్గమృగం "సుడాన్"కన్నుమూసింది. అనారోగ్యంతో బాధపడుతున్న సూడాన్ చనిపోయిందని కెన్యాలోని ఓఐ పెజెతా కన్జర్వెన్సీ మార్చి 20న తెలిపింది. వయోభారం, కాలికి సోకిన ఇన్ఫెక్షన్ కారణంగానే సూడాన్ మరణించిందని వెల్లడించింది.
చైనా రక్షణమంత్రిగా లెఫ్టినెంట్ జనరల్ వై ఫెంఘే
ప్రపంచంలో చైనాను మరింత శక్తిమంతంగా నిలిపేలా.. సమర్థవంతంగా, సేవా దృక్పథంతో పనిచేసేలా కొత్త మంత్రి వర్గాన్ని చైనా ప్రధాని లీ కెకియాంగ్ ఏర్పాటు చేశారు. నలుగురు ఉప ప్రధానులతో పాటు 26 మంత్రిత్వ శాఖలు, కమిషన్లతో కూడిన కొత్త కేబినెట్కు చైనా పార్లమెంటు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. భారత్ సహా పలు సరిహద్దు దేశాలతో విభేదాల నేపథ్యంలో క్షిపణి రంగ నిపుణుడు లెఫ్టినెంట్ జనరల్ వై ఫెంఘేను రక్షణ శాఖ మంత్రిగా నియమించింది. చైనాలో సైనిక ఆధునికీకరణ, పునర్వ్యవస్థీకరణకు ఆయన కృషి చేశారు.
కూలిన యూన్ వారసత్వ సంపద ఐస్బర్గ్
అర్జెంటీనాలో యునెస్కో వారసత్వ సంపదగా భాసిల్లుతున్న ఐస్ బ్రిడ్జి మార్చి 11న కుప్పకూలింది. పెంటగోనియాలోని లాస్ గ్లేసియర్ జాతీయ పార్కులో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ ఐస్ బ్రిడ్జి.. భారీ తుపాను ధాటికి కూలిపోయింది.
సర్వోన్నత నేత స్థాయికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇక జీవితకాలం ఆ పదవిలో కొనసాగేందుకు మార్గం అధికారికంగా సుగమమైంది. ఓ వ్యక్తి అధ్యక్షుడిగా రెండు కంటే ఎక్కువసార్లు పనిచేయకూడదంటూ ఉన్న పరిమితిని ఎత్తివేసే రాజ్యాంగ సవరణకు ఆ దేశ పార్లమెంటు మార్చి 11న ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జిన్పింగ్ రెండోసారి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఇకపై కూడా ఆయన ఎన్నాళ్లు కోరుకుంటే అన్నాళ్లు, అధ్యక్షుడిగా ఉండొచ్చు. ఇటీవలి దశాబ్దాల్లో చైనాలో అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా జిన్పింగ్ ఎదిగారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) స్థాపక చైర్మన్ అయిన మావో జెడాంగ్ తర్వాత అధ్యక్ష పదవిలో జీవితకాలం కొనసాగనున్న నేతగా జిన్పింగ్ రికార్డు సృష్టించనున్నారు.
అమెరికా కొత్త విదేశాంగ మంత్రిగా పాంపియో
అమెరికా విదేశాంగ శాఖ మంత్రిగా సీఐఏ డైరక్టర్ మైక్ పాంపియోను నియమిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. రెక్స్ టిల్లర్సన్పై కొంతకాలంగా ఆగ్రహంగా ఉన్న ట్రంప్ టిల్లర్సన్ ఆఫ్రికా పర్యటనలో ఉండగా కొత్త విదేశాంగ మంత్రిని ప్రకటించాడు. ఉత్తర కొరియా, రష్యాల విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలతో పాటు పలు అంశాలపై ట్రంప్, టిల్లర్సన్ మధ్య విభేదాలున్నాయి. పాంపియో నియామకం నేపథ్యంలో ప్రస్తుతం సీఐఏ డిప్యూటీ డెరైక్టర్గా ఉన్న జినా హాస్పెల్ను సీఐఏ కొత్త డెరైక్టర్గా నియమించారు.
చైనా రక్షణ బడ్జెట్ 175 బిలియన్ డాలర్లు
భారత్ సహా వివిధ దేశాలతో సరిహద్దు వివాదాలను ఎదుర్కొంటున్న చైనా ఈ ఏడాది తన రక్షణ, సైనిక కార్యకలాపాల కోసం బడ్జెట్లో భారీగా నిధులను కేటాయించింది. బడ్జెట్ నివేదికను చైనా ప్రధాన మంత్రి లీ కెఖియాంగ్ ఆ దేశ పార్లమెంటు ఎన్పీసీ (నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్)కి సమర్పించారు. 6.5 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును ఈ ఏడాదికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు బడ్జెట్ నివేదికలో చైనా పేర్కొంది. రక్షణ కోసం 175 బిలియన్ డాలర్ల (సుమారు రూ.11.40 లక్షల కోట్లు) నిధులను కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఇది 8.1 శాతం ఎక్కువ. అమెరికా తర్వాత రక్షణ విభాగానికి అత్యధికంగా నిధులు కేటాయిస్తున్న దేశం చైనాయే. భారత్ తన బడ్జెట్లో రక్షణ విభాగానికి కేటాయించిన నిధుల (46 బిలియన్ డాలర్లు- దాదాపు రూ.2.99 లక్షల కోట్లు) కన్నా చైనా బడ్జెట్ దాదాపు మూడున్నర రెట్లు ఎక్కువ.
శ్రీలంకలో అత్యవసర పరిస్థితి
శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మత ఘర్షణల నేపథ్యంలో దేశంలో పది రోజుల పాటు ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు అక్కడి సామాజిక సాధికారత శాఖ మంత్రి ఎస్.బి. దిస్సనాయకే మార్చి 6న వెల్లడించారు. శ్రీలంకలోని కాండీ జిల్లాలో బౌద్ధులు, ముస్లింల మధ్య తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. పలు మసీదులు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఘర్షణలు దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా నిరోధించేందుకు పది రోజుల పాటు అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆధ్వర్యంలోని మంత్రిమండలి ప్రకటించింది.
మహిళా దినోత్సవ ఇతివృత్తం - ‘ప్రెస్ ఫర్ ప్రోగ్రెస్’
2018 మహిళా దినోత్సవం(మార్చి 8) ఇతివృత్తంగా ‘ప్రెస్ ఫర్ ప్రోగ్రెస్’ (ప్రగతి కోసం పట్టుబట్టండి) నినాదాన్ని ఐక్యరాజ్య సమితి ఖరారు చేసింది. గత కొన్నేళ్లుగా స్త్రీలు అనేక రంగాల్లో పరుషులతో సమానంగా రాణిస్తున్నప్పటికీ ఇంకా ఆడ-మగ తారతమ్యాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానంగా ప్రస్తావించి పురుషులతో సమానంగా హక్కులు సాధించే లక్ష్యంతో ఈ నినాదాన్ని ఎంపిక చేశారు. 1975లో ఐక్యరాజ్య సమితి మార్చి 8ని మహిళా దినోత్సవంగా ప్రకటించింది. అయితే దీనికి ఎన్నో ఏళ్ల ముందు నుంచి కూడా అనేక దేశాల్లో మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. తొలిసారిగా అమెరికాలో 1909లో ఫిబ్రవరి 28ని మహిళా దినోత్సవంగా పాటించారు.